Read Bible
Free to use • No login or registration required • For all ages
Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.
1. సౌలు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. అతడు నలభై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు.
2. సౌలు ఇశ్రాయేలీయులలో మూడువేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండువేలమంది మిక్మషులో బేతేలు కొండ ప్రాంతంలో సౌలు దగ్గర ఉన్నారు; మిగిలిన వేయిమంది బెన్యామీనీయుల ఊరైన గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలినవారిని వారి గుడారాలకు పంపివేశాడు.
3. యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల సైనిక స్థావరాల మీద దాడి చేశాడు, ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది; అప్పుడు సౌలు దేశమంతట బూర ఊదించి, “హెబ్రీయులారా వినండి” అని చెప్పాడు.
4. సౌలు ఫిలిష్తీయుల సైనిక స్థావరాల మీద దాడిచేశాడని, దాని వలన ఇశ్రాయేలీయులంటే ఫిలిష్తీయులకు అసహ్యం కలిగిందని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు ప్రజలందరు గిల్గాలులో సౌలు దగ్గర సమావేశమయ్యారు.
5. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మూడువేల రథాలు, ఆరువేల గుర్రపురౌతులు, సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సైనికులను సమకూర్చుకున్నారు. వీరు బయలుదేరి బేత్-ఆవెనుకు తూర్పున ఉన్న మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.
6. ఇశ్రాయేలీయులు తాము క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామని తమ సైన్యమంతా ఒత్తిడిలో ఉన్నారని తెలుసుకొని గుహల్లో ముళ్ళపొదల్లో బండ సందుల్లో గుంటల్లో నీళ్లతొట్టెల్లో దాక్కున్నారు.
7. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి గిలాదు దేశానికి వెళ్లిపోయారు. సౌలు ఇంకా గిల్గాలులో ఉన్నాడు; అతనితో ఉన్న దళాలు అన్ని భయంతో వణుకుతూ ఉన్నాయి.
8. సమూయేలు చెప్పినట్లు అతడు ఏడు రోజులు ఎదురుచూశాడు; సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడంతో, అతని ప్రజలు చెదిరిపోవడం ప్రారంభించారు.
9. కాబట్టి సౌలు, “దహనబలులు సమాధానబలులు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పి దహనబలి అర్పించాడు.
10. అతడు దహనబలి అర్పించడం ముగించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలిసికొని అతనికి వందనం చేయడానికి బయలుదేరాడు.
11. అయితే సమూయేలు అతన్ని, “నీవు చేసిన పని ఏమిటి?” అని అడిగాడు. అందుకు సౌలు, “నిర్ణయించిన సమయానికి నీవు రాకపోవడం, ప్రజలు నా దగ్గర నుండి చెదిరిపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమావేశమవ్వడం చూసి,
12. ‘నేను ఇంకా యెహోవా దయను పొందక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద దాడిచేస్తారేమో’ అని అనుకున్నాను. కాబట్టి బలవంతంగా నేనే దహనబలి అర్పించాను” అన్నాడు.
13. అందుకు సమూయేలు, “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా నీవు బుద్ధిలేని పని చేశావు; నీ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచాలని యెహోవా తలంచారు.
14. అయితే ఇప్పుడు నీ రాజ్యం నిలబడదు. ఎందుకంటే యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు చేయలేదు. కాబట్టి యెహోవా ఒక మనుష్యుని కనుగొన్నాడు, అతడు తన హృదయానుసారుడైన మనుష్యుడు. ఆయన అతన్ని తన ప్రజల మీద రాజుగా నియమించారు” అన్నాడు.
15. తర్వాత సమూయేలు గిల్గాలు విడిచిపెట్టి బెన్యామీనీయుల గిబియాకు వచ్చాడు; సౌలు తన దగ్గర ఉన్న మనుష్యులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరువందలమంది ఉన్నారు.
16. సౌలు అతని కుమారుడైన యోనాతాను, వారితో ఉన్న ప్రజలతో కలిసి బెన్యామీనీయుల గెబాలో ఉన్నారు; ఫిలిష్తీయులు మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.
17. ఫిలిష్తీయుల శిబిరం నుండి దోచుకునేవారు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశానికి ఒఫ్రా మీదుగా వెళ్లే మార్గంలో తిరుగులాడారు.
18. రెండవ గుంపు బేత్-హోరోనుకు వెళ్లే మార్గంలో మూడవ గుంపు అరణ్యానికి ఎదురుగా ఉన్న జెబోయిము లోయ సరిహద్దు వెళ్లే మార్గంలో వెళ్లారు.
19. ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివారు లేకుండ చేశారు, ఎందుకంటే, “హెబ్రీయులు కత్తులు ఈటెలు తయారుచేయించకూడదు” అని ఫిలిష్తీయులు అనుకున్నారు.
20. కాబట్టి ఇశ్రాయేలీయులందరు తమ నాగలి నక్కులు, పారలు, గొడ్డళ్లు, కొడవళ్లకు పదును పెట్టించడానికి ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లవలసి వచ్చేది.
21. నాగలి కొనలు పారల పదునుకు షెకెలులో మూడింట రెండు వంతులు, ముండ్ల కొంకులు, గొడ్డళ్ళ పదునుకు, ములికోలు సరిచేయడానికి ఒక షెకెలులో మూడవ వంతు చెల్లించాలి.
22. కాబట్టి యుద్ధం జరిగే రోజున సౌలుతో యోనాతానుతో ఉన్న ప్రజల్లో ఒకరి చేతిలోనూ కత్తి గాని ఈటె గాని లేదు; కేవలం సౌలుకు అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే ఉన్నాయి.
23. ఫిలిష్తీయుల సైన్యపు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చారు.