Read Bible
Free to use • No login or registration required • For all ages
Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.
1. భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది.
2. ప్రజలు తూర్పు వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు.
3. వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు.
4. అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.
5. అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు.
6. యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు.
7. రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు.
8. కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు.
9. యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.
10. ఇది షేము కుటుంబ వంశావళి. జలప్రళయం గతించిన రెండు సంవత్సరాల తర్వాత, షేముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుట్టాడు.
11. అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
12. అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు.
13. షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా అతనికి కుమారులు కుమార్తెలు పుట్టారు.
14. షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు.
15. ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు బ్రతికాడు, అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
16. ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు.
17. పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
18. పెలెగు 30 సంవత్సరాల వయసువాడై రయూను కన్నాడు.
19. రయూ పుట్టిన తర్వాత పెలెగు 209 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
20. రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.
21. సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
22. సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు.
23. నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు.
24. నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు.
25. తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
26. తెరహు 70 సంవత్సరాల వయసులో ఉండగా అతనికి అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
27. ఇది తెరహు కుటుంబ వంశావళి. తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
28. హారాను, తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే, కల్దీయుల ఊరు అనే పట్టణంలో, తన జన్మస్థలంలో చనిపోయాడు.
29. అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
30. శారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలుగలేదు.
31. తెరహు తన కుమారుడైన అబ్రామును, తన మనవడు, హారాను కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారాయిని తీసుకుని కల్దీయుల ఊరు నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో వారు హారానుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.
32. తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు.