Read Bible
Free to use • No login or registration required • For all ages
Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.
1. యెహోవా మందసం ఏడు నెలలపాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంది.
2. ఫిలిష్తీయులు యాజకులనూ శకునం చూసేవారిని పిలిపించి “యెహోవా మందసాన్ని ఏం చేద్దాం? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకి పంపడానికి ఏమి చేయాలో చెప్పండి” అని అడిగారు. అందుకు వారు,
3. “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని పంపివేసే పక్షంలో ఉచితంగా పంపవద్దు. ఎలాగైనా ఆయనకు అపరాధ పరిహారం అర్పణంగా చెల్లించి పంపాలి. అప్పుడు మీరు బాగుపడి ఆయన కోపం మీ మీద నుండి ఇప్పటిదాకా ఎందుకు తొలగి పోలేదో తెలుసుకుంటారు” అని జవాబిచ్చారు.
4. ఫిలిష్తీయులు “మనం ఆయనకు పరిహారంగా చెల్లించాల్సిన అర్పణ ఏమిటి?” అని వారిని అడగగా వారు “మిమ్మలనూ మీ పెద్దలనూ పీడిస్తున్న తెగులు ఒక్కటే కాబట్టి ఫిలిష్తీయుల పెద్దల లెక్క ప్రకారం ఐదు బంగారపు గడ్డల రూపాలు, ఐదు బంగారపు పందికొక్కుల రూపాలు చెల్లించాలి.
5. కాబట్టి మీకు వచ్చిన గడ్డలకూ భూమిని పాడు చేసే పందికొక్కులకూ సూచనగా ఉన్న ఈ గడ్డలను, పందికొక్కుల రూపాలను తయారుచేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ కలిగించాలి. అప్పుడు మీకూ మీ దేవుళ్ళకూ మీ భూమికీ కీడు కలిగిస్తున్న ఆయన తన హస్తాన్ని తొలగించవచ్చు.
6. ఐగుప్తీయులు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకొన్నట్టు మీ మనసులను మీరెందుకు కఠినం చేసుకుంటారు? ఆయన వారి మధ్య అద్భుతాలు చేసినప్పుడు వారు ఈ ప్రజలను వెళ్ళనివ్వగా ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు కదా.
7. కాబట్టి మీరు ఒక కొత్త బండి తయారు చేయించి, ఇంతవరకూ కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి, బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి,
8. యెహోవా మందసాన్ని ఆ బండిమీద పెట్టి, పరిహారంగా ఆయనకు చెల్లించవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి, ఆ బండి దాని దారిలో వెళ్ళేలా వదిలిపెట్టండి.
9. అది బేత్షెమెషుకు వెళ్లే దారిలో ఈ దేశ సరిహద్దును దాటితే ఆయనే ఈ గొప్ప కీడు మనకు కలిగించాడని తెలుసుకోవచ్చు, ఆ దారిన వెళ్ళకపోతే ఆయన మనకి ఈ కీడు కలిగించలేదనీ, మన దురదృష్టం వల్లనే అది మనకు సంభవించిందనీ గ్రహించాలి” అన్నారు.
10. ఆ విధంగా వారు రెండు పాడి ఆవులను తోలుకువచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంట్లో ఉంచి
11. యెహోవా మందసాన్ని, బంగారు గడ్డల రూపాలూ పందికొక్కు రూపాలూ ఉన్న ఆ చిన్న పెట్టెను బండిమీద పెట్టారు.
12. ఆ ఆవులు రహదారి వెంబడి సాఫీగా వెళ్తూ, రంకెలు వేస్తూ, బేత్షెమెషుకు వెళ్లే దారిలో నడిచాయి. ఫిలిష్తీయుల పెద్దలు వాటిని వెంబడిస్తూ బేత్షెమెషు సరిహద్దు వరకూ వెళ్లారు.
13. బేత్షెమెషు ప్రజలు పొలంలో తమ గోదుమ పంట కోస్తున్నారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు మందసం కనబడింది. దాన్ని చూసి వారు సంతోషించారు.
14. ఆ బండి బేత్షెమెషుకు చెందిన యెహోషువ అనే వాడి పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర నిలిచింది. వారు బండికి ఉన్న కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.
15. లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను కిందికి దించి ఆ పెద్ద రాతిమీద పెట్టినప్పుడు ఆ రోజు బేత్షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు చేసి బలులు అర్పించారు.
16. ఫిలిష్తీయుల పెద్దలు ఐదుగురు జరిగినదంతా చూసి అదే రోజున ఎక్రోను చేరుకున్నారు.
17. పరిహార అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమంటే, అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను-ఈ ఐదు పట్టణాల ప్రజల కోసం ఒక్కొక్కటి.
18. ప్రాకారాలు ఉన్న పట్టణాలు, పొలాల్లో ఉండే గ్రామాలవారు, ఫిలిష్తీయుల ఐదుగురు పెద్దల పట్టణాలు అన్నిటి లెక్క ప్రకారం బంగారపు పందికొక్కులను అర్పించారు. యెహోవా మందసాన్ని కిందికి దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యం. ఇప్పటివరకూ ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలో ఉంది.
19. బేత్షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరచి చూసినప్పుడు దేవుడు వారిలో 70 మందిని హతం చేశాడు. యెహోవా కోపంతో అనేకులను దెబ్బ కొట్టగా ప్రజలు దుఃఖాక్రాంతులయ్యారు.
20. అప్పుడు బేత్షెమెషు ప్రజలు “పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడి నుండి ఆయన ఎవరి దగ్గరికి పోవాలో” అనుకుని
21. కిర్యత్యారీము ప్రజల దగ్గరికి మనుషులను పంపించి “ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి తీసుకు వచ్చారు, మీరు వచ్చి మీ దగ్గరకి దాన్ని తీసుకు వెళ్ళండి” అని కబురు పంపించారు.