Read Bible
Free to use • No login or registration required • For all ages
Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.
1. దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.
2. యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో “మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.
3. మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు.
4. వారు తమ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.
5. వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.
6. యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.
7. అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్ బేతేలు అని పేరు పెట్టారు.
8. రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి, దానికి అల్లోన్ బాకూత్ అనే పేరు పెట్టారు.
9. యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.
10. అప్పుడు దేవుడు అతనితో “నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు” అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
11. దేవుడు “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.
12. నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను” అని అతనితో చెప్పాడు.
13. దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.
14. దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.
15. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.
16. వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
17. ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో “భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు” అంది.
18. రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
19. ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.
20. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.
21. ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
22. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.
23. యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.
24. యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.
25. రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.
26. లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.
27. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.
28. ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
29. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.