Read Bible
Free to use • No login or registration required • For all ages
Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.
1. అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
2. వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.
3. వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
4. వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.
5. యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
6. యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
7. కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.
8. ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.
9. అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
10. షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.
11. షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
12. అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
13. అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
14. షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
15. షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
16. ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
17. ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
18. పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
19. పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.
20. రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
21. రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.
22. సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
23. సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.
24. నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.
25. నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
26. తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.
27. తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
28. హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు.
29. అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.
30. శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
31. తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
32. తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.